కుందేరు

కుందేరు (కుందూ లేక కుముద్వతి అని కూడా వ్యవహరించబడుతోంది) నది ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న ఎర్రమల కనుమలలో పుట్టి దక్షిణ దిశలో ప్రవహించి వైఎస్ఆర్ జిల్లా, కమలాపురం సమీపములో పెన్నా నదిలో కలుస్తుంది. కుందూ నదీతీరాన ఉన్న పట్టణాలలో నంద్యాల ముఖ్యమైనది, అతి పెద్దది. నది నీటి పరీవాహక పరిధిలో ఉన్న మండలాలు కర్నూలు జిల్లలోని ఓర్వకల్లు, మిడుతూరు, గడివేముల, నంద్యాల, గోస్పాడు, కోయిలకుంట్ల, దొర్నిపాడు మరియు చాగలమర్రి, వైఎస్ఆర్ జిల్లాలోని మైదుకూరు.

నంద్యాల-కర్నూలు మార్గంలో కుందూనది - 2009 అక్టోబరు మాసంలో వరదలు వచ్చినప్పుడు తీయబడిన చిత్రము

కుందేరులో నీళ్లు పశ్చిమాన మద్దులేరు, జుర్రేరు నుండి తూర్పున కాళి మరియు వక్కలేరు నుండి చేరతాయి. కుందేరు మరియు మద్దులేరు నిండా నీటితో ప్రవహించినప్పుడు వాటి మధ్యన ఉన్న జలకనూరు వంటి గ్రామాలు నీటితో నిండిపోతాయి. జుర్రేరు బనగానపల్లె ప్రాంతము నుండి ప్రవహించి కుందేరులో చేరుతుంది.

కుందేరు నదీ అడుగులో రాతిమయము. ఇక్కడ సున్నపురాళ్లను త్రవ్వి తీస్తారు. నది అడుగున శిలల పొరల వలన నీరు భూమిలోకి ఇంకక పోవడము విశేషము. దీనివల్ల నది వెంబడి ఉన్న బావుల్లో నీరు తాగే యోగ్యముగా లేదు.

నంద్యాల వద్ద కుందేరు కర్నూలు - కంభం రహదారి దాటే చోట 1864లో ఒక వంతెన నిర్మించారు.

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.