కాశీం

కాశీం తెలంగాణ ప్రాంతానికి చెందిన విప్లవకవి, సహిత్య విమర్శకుడు. వృత్తిరీత్యా విశ్వవిద్యాలయాచార్యులు. విప్లవ రచయితల సంఘంలో క్రియాశీల బాధ్యులు. తెలంగాణ ఉద్యమంలోనూ గణనీయమైన పాత్ర పోషించాడు. ఊరూరా తన ఉపన్యాసాలతో ఉద్యమానికి ఊతనిచ్చాడు. అతను సైద్ధాంతిక రాజకీయ విశ్లేషణలనందించిన మేథావి, వక్త.

స్వస్థలం

మహబూబ్ నగర్ జిల్లాలోనిఅచ్చంపేట ప్రాంతానికి చెందినవాడు. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించాడు. విప్లవం ద్వారా సామాజిక మార్పు సాధ్యమనే దృక్పథం కలవాడు. అతను ప్రజాస్వామిక తెలంగాణను కోరుకున్నాడు. అతను సంపాదకత్వం వహిస్తున్న "నడుస్తున్న తెలంగాణ" మాసపత్రిక తెలంగాణలో బలమైన ప్రతిపక్ష గొంతు. [1]

వృత్తి జీవితం

కాశీం మొదట్లో హైదరాబాద్లోని ఆంధ్ర సారస్వత పరిషత్లో తెలుగు ఆచార్యులుగా పనిచేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో తెలుగు ఆచార్యులుగా పనిచేస్తున్నాడు.

రచనలు

  1. పొలమారిన పాలమూరు (దీర్ఘ కవిత)
  2. గుత్తికొండ (దీర్ఘ కవిత)
  3. నేను తెలంగాణోన్ని మాట్లాడుతున్నా (వ్యాసాలు)
  4. తెలంగాణ ఉద్యమాలు-పాట (వ్యాసాలు)
  5. తెలంగాణ సాహిత్య వ్యాసాలు
  6. కాశీం కవిత్వం
  7. తెలంగాణ సాహిత్య వ్యాసాలు
  8. మానాల (దీర్ఘ కవిత)
  9. వర్గీకరణ నాలుగు వ్యాసాలు
  10. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు - విద్రోహ రాజకీయాలు (వ్యాసాలు)
  11. ప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్యం (పి.హెచ్.డి సిద్ధాంత గ్రంథం)
  12. ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వం (ఎం.ఫిల్ పరిశోధనా పత్రం)

'పొలమారిన పాలమూరు ' రచనను 2003 లో వెలువరించాడు. ఇది పాలమూరు జిల్లాలోని తీవ్రమైన కరువు నేపథ్యంలో వెలువరించిన దీర్ఘకవిత. 2003 లో పాలమూరు జిల్లా కరువు వ్యతిరేక పోరాట కమిటి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్‌లోని టౌన్ హాలులో నిర్వహించిన 'పాలమూరు గోస ' కవి,గాయక సమ్మేళనంలో ఆవిష్కరించి, వినిపించాడు.

కాశీం కవిత్వంపై వ్యాఖ్యలు

కాశీం కవిత్వంపై పలువురు రచయితలు, ఆయన ఉద్యమ సహచరులు పలు వ్యాఖ్యానాలు చేశారు. వాటిలో కొన్ని...

నాళేశ్వరం శంకరం
"కాశీం కవిత్వం సహజంగా కురిసే వర్షంలా ఉంటుంది. పారే నదిలా ఉంటుంది. మొలకెత్తే విత్తనంలా ఉంటుంది. పంటపొలం లా ఉంటుంది. ఆయన కవిత్వంలో తేమ ఎక్కువ."[2]
ఎండ్లూరి సుధాకర్
"అతని జీవితమే అతన్ని ఇంతటి స్థాయికి తెచ్చింది."
నందిని సిధారెడ్డి
"ఆయన కవిత్వంలో అడుగుపెడితే అక్షరాలు తిరగబడుతున్న అలజడినీ, ఇగం పట్టిన పనిముట్టు మంట కాగుతున్న ఇగురం ధ్వనిస్తుంది. ఆయన అనుభవం మన అనుభవంలోకి కవిత్వం ద్వారా ప్రవేశింపగలిగాడు.
వరవరరావు
"కాశీం కవిత్వంలో ప్రకృతిలో బీభత్సమూ, సౌందర్యమూ కలనేతగా కనిపించే దృశ్యాల వలే ఆయన కవనాక్షరం రూపుదిద్దుకుంటుంది."

ఇటీవల వార్తల్లో

కాశీం ఇటీవల వార్తల్లో నిలిచాడు. తెలంగాణ ప్రభుత్వం అతనిపై రాజద్రోహం కేసు మోపి అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్ట్‌లతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి.

బయటి లంకెలు

మూలాలు

  1. "కరపత్రం - కాశీం - విరసం" (PDF).
  2. [ http://www.namasthetelangaana.com/EditPage/article.aspx?category=4&subCategory=1&ContentId=490967 గరిక మైదానం నవ్వు: నాళేశ్వరం శంకరం,చెలిమె,నమస్తే తెలంగాణ,22.02.2016]
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.