కవిత్రయం

వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని తెలుగు పద్యకావ్యంగా అనువదించిన ముగ్గురు కవులు తెలుగు సాహితీ చరిత్రలో కవిత్రయం అని మన్ననలందుకొన్నారు.

నన్నయ

ఈయన తెలుగు సాహిత్యానికి ఆద్యుడు. ఆదికవి అని పేరుగన్నవాడు. మహాభారతాన్ని తెలుగులో అనువదించిన కవిత్రయంలో మొదటి వాడు. ఆది పర్వము, సభాపర్వము రచించి, అరణ్య పర్వము కొంత వరకే వ్రాయగలిగాడు.

తిక్కన

ఈయన భారతంలో అత్యధిక భాగాన్ని తెలుగులోకి అనువదించాడు. నన్నయ అసంపూర్ణంగా వదిలేసిన అరణ్య పర్వాన్ని అలాగే ఉంచి మిగిలిన 15 పర్వాలను తిక్కన వ్రాశాడు.

ఎఱ్ఱన

ఈయన ప్రబంధ పరమేశ్వరుడని బిరుదు పొందాడు. నన్నయ, తిక్కన అసంపూర్ణంగా మిగిల్చిన అరణ్య పర్వాన్ని ముగించి తెలుగు వారికి తెలుగులోనే ఆ ఆదికావ్యాన్ని చదువుకునే అదృష్టాన్ని కలిగించాడు.

== కవిత్రయం ==

నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడలు తెలుగునాట ప్రసిద్ధి గాంచినకవులు. సంస్కృతంలో వేద వ్యాసుడు రచించిన,పంచమ వేదంగా కీర్తిగాంచిన మహాభారతాన్ని ఈ ముగ్గురు కవులు తెలుగులోకి అనువదించారు. సంస్కృతం నుండి అనువదించినప్పటికీ, తెలుగులో దీనిని స్వతంత్ర 'కావ్యం'గా తీర్చి దిద్దారు.

రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ. ఈయన క్రీ.శ. 1050 ప్రాంతంవాడు. అవిరళ జప హోమ తత్పరుడు. రాజరాజు తాను చంద్రవంశ క్షత్రియుడనని, తన పూర్వీకులైన భరత వంశస్థుల చరిత్రను తెలుగులోకి అనువదించ కోరుతున్నానని నన్నయను భారతాంధ్రీకరణకు ప్రేరేపించాడు.

అప్పటికే తెలుగు పరిసర భాషలయిన తమిళ కన్నడాలలోకి భారతం అనువదింపబడింది. ఈ ప్రేరణతో నన్నయ భారతానువాదానికి "శ్రీవాణీ గిరిజాశ్చిరాయ.." అను శ్లోకంతో శ్రీకారం చుట్టాడు. ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానారుచిరార్థ సూక్తి నిధిత్వం అనే శైలీలక్షణాలతో నన్నయ ఆది సభాపర్వాలను, అరణ్యపర్వంలో నాలుగవ ఆశ్వాసంలోని "శారద రాత్రులుజ్వల.." అనే పద్యం వరకు రచించి తనువు చాలించాడు. భారతంతో పాటు "ఆంధ్ర శబ్ద చింతామణి" అనే వ్యాకరణ గ్రంథం కూడా రచించడం వలన "వాగమశాసనుడు" అనే బిరుదు కూడా పొందాడు.

నన్నయ తరువాత క్రీ.శ. 1250 ప్రాతంలో నెల్లూరు మండలాన్ని పరిపాలించిన మనుమసిద్ది దగ్గర ఆస్థాన కవిగా, మంత్రిగా పని చెసిన తిక్కన భారతాంధ్రీకరణకు పూనుకున్నాడు. ఈయన తండ్రి పేరు కొమ్మన, తల్లి అన్నమ. ప్రౌఢవిజ్గ్ఞానదీపుడు, నీతి చాణుక్యుడు అయిన తిక్కన ఆంధ్ర మహాభారతంలోని విరాటపర్వం మొదలు స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను అనువదించాడు. రచనా శిల్పంలోను,విశిష్ట శైలిలోనూ, వినూత్న భాషాప్రయోగంలోనూ, నాటకీయ రచనా విన్యాసంలోనూ అద్వితీయమైన సంవిధానంతో తిక్కన భారతాన్ని ఆంధ్రీకరించాడు.

ఈయన భారతంతో పాటు రామయణంలోని ఉత్తరరామకథను "నిర్వచనోత్తర రామాయణం" అనే పేరుతో వెలయించాడు. ఇంకా "విజయసేనం" అనే కావ్యాన్ని కూడా రచించాడు. తిక్కనను "బ్రహ్మ కవి" అని ఎర్రన ప్రశంసించాడు. సంసృతాంధ్ర భాషలలో సరిసమాన ప్రతిభా పాటవాలు కలిగిన తెలుగు భాష అందచందాలు తిక్కన కవిత్వంలో కనిపిస్తాయి.

నన్నయ తిక్కనల చేత భారతాంధ్రీకరణ పూర్తికాలేదు. నన్నయ విడిచిన అరణ్యపర్వ శేషభాగం అలాగే ఉండిపోయింది. దీనిని క్రీ.శ. 14వ శతాబ్దంలో అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానకవి ఎర్రన (ఎర్రాప్రగడ) తెనిగించాడు. ఈయన ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు వాస్తవ్యులయిన సూరన, పోతమాంబలకు జన్మించాడు.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.