కంసుడు

ఉగ్రసేనుడు అనె యాదవ రాజుకు కొడుకు. మధురాపురమునకు రాజు. శ్రీకృష్ణుని మేనమామ. ఇతడు పూర్వజన్మమునందు కాలనేమి అను రాక్షసుడు. కనుక ఈ జన్మమందును ఆవాసనతప్పక దేవతలకు విరోధియై అనేకులను రాక్షసులను తోడుచేసికొని సాధువులను బాధించుచు ఉండును. ఇట్లు ఉండి ఒకనాడు తన చెల్లెలు అగు దేవకీదేవిని వసుదేవునకు ఇచ్చి వివాహముచేసి ఆవధూవరులను రథముమీఁద కూర్చుండఁబెట్టుకొని తాను సారథియై మిక్కిలి ఉత్సాహముతో రథమును తోలుకొని పోవుచు, "నీచెల్లెలి యొక్క యెనిమిదవ కొడుకు నిన్ను చంపును" అను మాట ఒకటి చెవినిపడఁగానే మనసు చలింపఁగా, తటాలున రథమునుండి దిగి చెల్లెలు ఐన దేవకీ దేవిని కొప్పుపట్టి ఈడ్చి నేలఁబడవేసి తలనఱికి చంపఁబోయెను. అప్పుడు వసుదేవుఁడు బహువిధముల వేఁడుకోఁగా, చంపక విడిచి పెట్టి అది నిమిత్తముగా దేవకీవసుదేవులకు సంకెళ్లువేసి కారాగృహమునందు ఉంచి దేవకి కన్నకొడుకులను ఎల్లను చంపుచువచ్చి, కడపట యోగమాయవల్ల కృష్ణుఁడు వ్రేపల్లెలో నందునియింట చేరి ఉన్న సమాచారముతెలిసి, అతని చంపుటకు బహుప్రయత్నములుచేసి కడపట అతనిచేతనే చచ్చెను.

కంసుడు భాగవత పురాణంలోని ఒక పాత్ర.


మూలాలు

  • పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.