ఒడిస్సీ

ఒడిస్సీ భారతదేశపు శాస్త్రీయనృత్యాలలో ఒకటి. ఇది ఈశాన్య రాష్ట్రమైన ఒడిషాలో పుట్టినది. క్రీ.పూ. రెండో శతాబ్దంలో జైన రాజైన ఖారవేలుని పరిపాలనలో ఒడిస్సీ ఎక్కువగా పోషింపబడి అభివృద్ధి చెందినది. ఈ నాట్యం కూడా నాట్యశాస్త్ర సూత్రాలపై ఆధారపడి కూర్చబడింది. మొదట్లో దీనిని పూరి లోని జగన్నాధ స్వామివారి ఆలయంలో 'మహరిలు'అనే స్త్రీలు ప్రదర్శించేవారు. ఒడిస్సీ నృత్యం భారతీయ శిల్పానికి విలక్షణ శైలిగా ఉన్న మైలిక త్రిభంగ అనే భంగిమ చుట్టూ అల్లుకొని ఉంటుంది.

చరిత్ర

క్రీపూ 2వ శతాబ్దానికి చెందిన ఖారవేలుని కాలంనాటిదిగా చెప్పబడుతున్న ఒడిస్సీ నాట్యపు చిత్రపటం ఉదయగిరిలోని మంచాపురి గుహలో లభ్యమైంది. ఈ చిత్రంలో రాజు తన ఇద్దరు రాణులతో కూడి మహిళా బృందం సంగీతం పలికిస్తుండగా నాట్యకత్తె నృత్యప్రదర్శనను తిలకిస్తున్నట్లుగా చిత్రించబడి ఉంది.[1]

దేవాలయాల్లో

ఒడిషా రాజధానియైన భువనేశ్వర్ లో క్రీ.పూ 2వ శతాబ్దానికి చెందిన జైన గుహలున్నాయి. ఇవి ఆకాలంలో ఖారవేలుని ఆస్థానంగా ఉపయోగపడేవని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ గుహల్లో కనుగొనబడ్డ ఆధారాలవల్ల ప్రాచీనమైన నాట్యకళారీతుల్లో ఒడిస్సీదే ప్రథమ స్థానమని కొంతమంది పండితులు భావిస్తున్నారు. ఇంకా కోణార్క్ సూర్యదేవాలయం, భువనేశ్వర్ లోని బ్రహ్మేశ్వరాలయంలో కూడా ఈ నాట్యానికి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి.[2]

సాంప్రదాయాలు

ఒడిస్సీలో ప్రధానంగా మూడు సాంప్రదాయాలున్నాయి. అవి మహరీ, నర్తకి, గోటిపువా. మహరీలు అంటే ఒడిషాకు చెందిన దేవ దాసీలు. వీరు ముఖ్యంగా పూరీ జగన్నాథ దేవాలయం దగ్గర ఉండేవాళ్ళు. పూర్వ కాలంలో మహరీలు కేవలం నృత్తం (శుద్ధమైన నాట్యం), మంత్రాలకు, శ్లోకాలకు అభినయించడం మాత్రమే చేసేవారు. ఇప్పుడు జయదేవుని గీతగోవిందం లోని పల్లవులకు కూడా నృత్యాభినయాలు ప్రదర్శిస్తున్నారు.

నర్తకి సాంప్రదాయం ముఖ్యంగా రాజు ఆస్థానాలలో జరిగే ప్రదర్శనలకు సంబంధించింది.

పదజాలం

సాంప్రదాయ ఒడిస్సీ నృత్యంలో నైపుణ్యాలు ఈ క్రింద పేర్కొనబడ్డాయి.

మంగళాచరణం

ఇందులో ముందుగా ఆవాహన ఉంటుంది. పూరీ జగన్నాథునకు ప్రణామాలర్పించిన తర్వాత మరేదైనా దైవాన్ని కీర్తిస్తూ ఒక శ్లోకం పాడతారు. ఈ శ్లోకంలో అర్థాన్ని నృత్యం ద్వారా అభినయిస్తారు. ఇందులో భూమి ప్రాణం అనే ప్రక్రియ కూడా ముఖ్యమైనది. దీనిద్వారా నాట్యంలో భాగంగా భూమిని బలంగా తొక్కుతున్నందుకు భూమితల్లిని క్షమాపణలు అడుగుతారు. ఇంకొక ముఖ్యమైన ప్రక్రియ త్రిఖండి ప్రాణంలో చేతులు శిరసు పైకి ఎత్తి దేవుళ్ళకి, అభిముఖంగా గురువులకు, హృదయానికి దగ్గరగా చేతులు చేర్చి ప్రేక్షకులకు నమస్కారం చేస్తారు.

బట్టు నృత్యం

నాట్యానికి ఆద్యుడైన నటరాజుకు సమర్పిస్తూ చేసే నృత్యం. ఈ భాగం ఒడిస్సీ నృత్యంలోని సారాంశాన్ని వెలికితీస్తుంది. ఒడిషాలోని వివిధ దేవాలయాల గోడల మీద కనిపించే వివిధ భంగిమలను కూర్చి కొన్ని అడుగులతో కలిపి నాట్యంగా అభినయిస్తారు.

పల్లవి

ఇది పూర్తి నాట్యంతో కూడుకుని ఉంటుంది. ఇందులో రాగంలోని అర్థాన్ని కనుల కదలికలు, శరీర భంగిమలు, పాదాల కదలికల ద్వారా పలికిస్తారు. ముందుగా మంద్రంగా ప్రారంభమై చివరికి వచ్చేసరికి నాట్యం ఊపందుకుంటుంది. సంగీతం, నాట్యం ఆదినుండి సరళంగా ప్రారంభమై రాను రానూ సంక్లిష్టంగా మారతాయి.

అభినయం

ఇందులో భావ వ్యక్తీకరణ ముఖ్యం. ముద్రల ద్వారా ఏదైనా ఒక కథను ముఖ కవళికల ద్వారా, శరీర కదలికల ద్వారా అభినయిస్తారు. ఇందుకు సంస్కృతం లేదా ఒరియా శ్లోకాలను ఆలపిస్తారు. జయదేవుని కావ్యమైన గీతగోవిందం లోని అష్టపదులు ఈ ప్రక్రియలో విరివిగా వాడుతారు.

నృత్య రూపకం

అభినయంకంటే ఎక్కువ సమయం తీసుకునేది. సాధారణంగా ఒకరికంటే ఎక్కువ కళాకారులచే ప్రదర్శించబడుతుంది.చాలా రూపకాలకు హిందూ పురాణాలే ఆధారం. కానీ ఇటీవల ఇందులో వినూత్నమైన ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి.

ప్రముఖులు

విశేషాలు

  • ఒడిస్సీ నృత్యసంప్రదాయానికి గురు కేలూచరణ్ మహాపాత్ర అగ్రగణ్యుడు.
  • ఈ నాట్యానికి అత్యంత ప్రాచుర్యం తెచ్చి దీనికి సార్వత్రికతను తెచ్చిపెట్టిన నర్తకి సంయుక్తా పాణిగ్రాహి

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.