ఋష్యశృంగుడు

ఋష్యశృంగ మహర్షి గురించి రామాయణము లోని బాల కాండములో వివరించబడింది. దశరథుని మంత్రి అయిన సుమంతుడు ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు.దశరథమహారాజు అశ్వమేథ యాగము, పుత్రకామేష్టి యాగము చేస్తాడని సనత్కుమారుడు ఋషులకు చెప్పుచుండగా తాను విన్నట్లు సుమంతుడు దశరథునితో చెప్పాడు.

వేశ్యల చేత ఆకర్షితుడైన ఋష్యశృంగుడు

ఋష్యశృంగుడి జననము - విద్యాబుద్ధులు

కశ్యప ప్రజాపతి కుమారుడైన విభాండకుడు అనే మహర్షి ఒక రోజు సంధ్యా వందనము చేసుకొను సమయమున, ఆయనకు ఆకాశమార్గాన పోతున్న ఊర్వశి కనిపిస్తుంది. ఆ ఊర్వశిని చూసి విభండక మహర్షి తన వీర్యాన్ని సరోవరములో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని త్రాగిన ఒక జింక గర్భం ధరించి, కొమ్ము కల బాలునికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించాడు కావున ఆ బాలకునకు ఋష్యశృంగుడు అని పేరు పెడతాడు విభండకుడు. ఋష్యశృంగునికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞయాగాది క్రతువులు తానే గురువై, విభండక మహర్షి నేర్పుతాడు. విభండక మహర్షి ఋష్యశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకములోని స్త్రీపురుష తారతమ్యములు తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడు జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు.

అంగరాజ్యములో క్షామము

ఇలా ఉండగా, అంగ రాజ్యాన్ని రోమపాదుడు అనేరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణమున ఆ అంగ రాజ్యంలో వర్షాలు పడడం మానేసి అనావృష్టితో క్షామము వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీనికి పరిష్కారముగా ఏమి చెయ్యవలెననని తన మంత్రులను అడుగగా, వారు ఋష్యశృంగుడిని రాజ్యములోకి రప్పిస్తే రాజ్యములో వర్షాలు పడాతాయి అని మంత్రులు సలహా చెబుతారు.

వేశ్యల ఉపాయము

రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుడు తండ్రి సంరక్షణలో పెరుగుచున్నాడని, విషయ సుఖాలంటే తెలియవని, అందువలన ఋష్యశృంగుని రప్పించటం దుర్భేద్యమైన కార్యమని, దానికి తరుణోపాయంగా విభండక మహర్షి ఆశ్రమములో లేని సమయములో వేశ్యలని పంపమని చెబుతారు.

మహారాజు అందుకు అంగీకరించి, వేశ్యలని ఋష్యశృంగుడు ఉండే ఆశ్రమం వైపు పంపిస్తాడు. ఆ వేశ్యలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడ పాటలు పాడుతూ నాట్యాలు చేస్తారు. ఆ శబ్దాలకు ఋష్యశృంగుడు అక్కడకు వస్తాడు. వారు ఋష్యశృంగుడిని చూసి విభండక మహర్షి ఆశ్రమములో లేడని తెలుసుకొని ఋష్యశృంగుడి ఆశ్రమానికి చేరుతారు. విషయసుఖాలంటే తెలియని, స్త్రీపురుష భేదము తెలియని ఋష్యశృంగుడు వేశ్యలకు ఆర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అది సేవించి, ఋష్యశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండివంటలు పెడతారు. ఋష్యశృంగుడు వాటిని ఫలాలు అని సేవిస్తాడు. వేశ్యలు విభండక మహర్షి వచ్చే సమయం అయిందని భావించి వెళ్ళి పోతూ వెళ్ళి పోతూ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగలించుకొంటారు.

వారు కౌగిలించుకొన్న తరువాత విషయ వాంఛలు లేని ఋష్యశృంగుడికి కూడా వారిని చూడాలి అనే కోరిక పుడుతుంది, వారిని వెతుకుతూ వెళ్ళగా వారు కనిపిస్తారు. వారు ఋష్యశృంగుడిని తమ ఆశ్రమానికి రమ్మంటారు. ఋష్యశృంగుడు అంగీకరించి వారివెంట అంగదేశములో అడుగు పెడతాడు. అతడు అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షము పడుతుంది.

ఋష్యశృంగుడు - శాంత ల వివాహము

ఋష్యశృంగుడిని ఆహ్యానించుటకు అంగ దేశము వెళుతున్న ధశరథుడు- పర్షియన్ రామాయణం నుండి ఒక దృశ్యం

కపటనాటకము ద్వారా ఋష్యశృంగుడిని తీసుకొని వచ్చిన విషయాన్ని ఆయన తండ్రి అయిన విభండక మహర్షికి చెప్పి ఆయన నుండి అభయాన్ని కోరుకొంటారు. రోమపాదుడు తన కూతురైన శాంతను ఋష్యశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు

కిగ్గా లో ఋష్యశృంగ మహర్షి గుడి

ఋష్యశృంగుడి దేవాలయము ఇప్పటి శృంగేరికి 10 మైళ్ల దూరములో కిగ్గా అనే గ్రామములో ఉంది. శృంగేరికి ఆ పేరు ఋష్యశృంగ మహర్షి వల్లే వచ్చిందని కూడా చెబుతారు.

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.