ఉమాభారతి

వర్తమాన భారత రాజకీయాలలో ఫైర్‌బ్రాండ్‌గా పేరుపొంది, ప్రముఖ భారత మహిళా రాజకీయనేతలలో ముఖ్యమైన స్థానం సంపాదించిన ఉమాభారతి (Uma Bharati) 1959, మే 3న మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని టిటాంగర్‌ జిల్లాలోని దుండాలో లోఢి రాజ్‌పుత్ కుంటుంబంలో జన్మించింది. చిన్న వయస్సులోనే పురాణాలపై అధ్యయనం కొనసాగించిన ఉమాభారతి రాజమాత విజయరాజె సింధియా సంరక్షణలో పెరిగి హిందూత్వ ప్రచారకురాలిగా కాషాయ వస్త్రాలు ధరించి అనేక దేశాలలో ప్రసంగాలు చేసింది.[1] సాధ్వి రితంభరతో కలిసి అయోధ్య రామజన్మభూమి ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది. ఉద్యమ సమయంలో राम-लाला हम आएंगे, मदिंर वही बनाएंगे! (శ్రీరామ భగవంతుడా మేము వచ్చి మందిరాన్ని అక్కడే నిర్మిస్తాం) నినాదాన్ని లేవదీసింది.

ఉమాభారతి


మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

వ్యక్తిగత వివరాలు

జననం (1959-05-03) 1959 మే 3
దుండా (టిటాంగర్ జిల్లా), మధ్య ప్రదేశ్
రాజకీయ పార్టీ భారతీయ జన శక్తి పార్టీ]
జీవిత భాగస్వామి అవివాహితురాలు
సంతానము -
ఏప్రిల్ 12, 2009నాటికి

రాజకీయ ప్రస్థానం

యుక్తవయస్సులోనే విజయరాజె సింధియా స్పూర్తితో ఉమాభారతి భారతీయ జనతా పార్టీలో చేరి 1984లో లోకసభకు పోటీచేసింది. 1984లో ఓడిపోయిననూ 1989లో ఖజురాహో స్థానం నుండి పోటీచేసి విజయం సాధించింది. ఆ తర్వాత 1991, 1996 మరియు 1998లలో అదే స్థానం నుండి వరస విజయాలను నమోదుచేసింది. 1999లో స్థానం మార్చి భోపాల్ నియోజకవర్గం నుండి గెలుపొంది కేంద్రంలో అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిపదవిని కూడా నిర్వహించింది. 2003 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆమె నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నాలుగింట మూడువంతుల మెజారిటీతో అఖండ విజయం సాధించింది. 2004 ఆగష్టులో "1994 హుబ్లీ వివాదం" కేసులో అరెస్టు వారెంటు జారీకావడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆమె భారతీయ జనతా పార్టీని వీడి భారతీయ జన శక్తి అను కొత్త పార్టీని స్థాపించింది. 2008లో జరిగిన మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేదు. తదనంతర పరిస్థితులలో 2011లో ఆమె తన పార్టీని భా.జ.పాలో విలీనం చేసారు. తరువాత భా.జ.పా ఉపాధ్యక్షురాలిగా నియముతులయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాణ్సి నియోజకవర్గం నుండి 1,90,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో సమాజ్ వాది పార్టి అభ్యర్థి చంద్రపాల్ సింగ్ యాదవ్ పై నెగ్గారు.[2]

2008 మధ్యప్రదేశ్ ఎన్నికలు

భారతీయ జనతా పార్టీని వదలి భారతీయ జనశక్తి పార్టీని స్థాపించిన ఉమాభారతి 2008లో జరిగిన మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. పార్టీ వ్యవస్థాపకురాలైన ఆమె స్వయంగా టికాంగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి ఓడిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి యజువేంద్ర సింగ్ బుండేలా చేతిలో సుమారు 3000 ఓట్ల తేడాతో పరాజయం పొందినది.[3] భారతీయ జనతా పార్టీని ఓడించడమే లక్ష్యంగా ప్రచారం చేసి తన లక్ష్యసాధనలో విఫలమైతే రాజకీయ సన్యాసం చేసి కేదార్‌నాథ్ వెళ్తానని ప్రకటించింది. అయిననూ రాష్ట్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.[4] అంతకు క్రితం 2007లో ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కూడా పోటీచేసి కనీసం 50 స్థానాలు సాధిస్తానని ప్రకటించిననూ ఫలితం దక్కలేదు.

బయటి లింకులు

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.