ఇంద్రగంటి జానకీబాల

ఇంద్రగంటి జానకీబాల కవయిత్రిగా, రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణిగా కృషిచేశారు. జానకీబాల భర్త, మామలు తెలుగు సాహిత్యంలో కవులుగా, సాహిత్యవేత్తలుగా ప్రసిద్ధి పొందారు.

ఇంద్రగంటి జానకీబాల
ఇంద్రగంటి జానకీబాల
జననం డిసెంబరు 4, 1945
రాజమండ్రి
నివాస ప్రాంతం హైదరాబాద్
ప్రసిద్ధి నవలా రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు.
ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి
మతం హిందూ
భార్య / భర్త ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
పిల్లలు ఇంద్రగంటి మోహనకృష్ణ
తండ్రి రామచంద్రశర్మ
తల్లి లక్ష్మీనరసమాంబ

వ్యక్తిగత జీవితం

ఇంద్రగంటి జానకీబాల డిసెంబరు 4, 1945న రాజమండ్రిలో జన్మించారు. జానకీబాల తల్లిదండ్రులు సూరి రామచంద్రశర్మ, లక్ష్మీనరసమాంబ.[1] ఆమె విద్యాభ్యాసాన్ని తణుకులోని సీతామహాలక్ష్మి జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో పూర్తిచేశారు. 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సెక్షన్ గుమస్తా ఉద్యోగంలో చేరారు. తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధులైన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మూడో కుమారుడు కవి, విమర్శకుడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మను వివాహం చేసుకున్నారు. వారి కుమారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సినీరంగంలో దర్శకునిగా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా విజయవాడలో పాతికేళ్లపాటు నివసించారు. 1991లో ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.[2]

సాహిత్యరంగం

జానకీబాల కవయిత్రిగా, రచయిత్రిగా, పరిశోధకురాలిగా పలు గ్రంథాలు రచించారు. సినీనేపథ్య గాయనుల జీవిత విశేషాలతో కూడిన పరిశోధన గ్రంథం కొమ్మా కొమ్మా కోయిలమ్మా..ను వెలువరించారు. జానకీబాల ఆరు కథాసంపుటాలను, పన్నెండు నవలలను, ఒక కవిత్వసంకలనాన్ని ప్రచురించారు.[2]

రచనల జాబితా

నవలలు

జానకీబాల రచించిన నవలల జాబితా ఇది:[3]

  • కరిగిన హరివిల్లు
  • విశాల ప్రపంచం
  • వెన్నలమట్టి
  • ఆవలితీరం
  • తరంగిణి (పుస్తకం)
  • నీలిరాగం
  • నిజానికి అబద్ధానికి మధ్య
  • మాతృబంధం
  • సజలనేత్రి
  • కనిపించేగతం
  • రాగవల్లకి
  • పంజరం కోరిన మనిషి

కథా సంపుటాలు

నాన్ ఫిక్షన్

  • కొమ్మా కొమ్మా కోయిలమ్మా

సంపాదకత్వ బాధ్యతలు

పలు సావనీర్లకు, పుస్తకాలకు, సంకలనాలకు జానకీబాల సంపాదకత్వ బాధ్యతలు వహించారు. 2002లో అమెరికాకు చెందిన వంగూరి ఫౌండేషన్ ప్రచురించిన అమెరికా తెలుగు కథకు సహ సంపాదకురాలిగా వ్యవహరించారు. ప్రముఖ సంగీతవేత్త, ఆకాశవాణి లలిత సంగీత దర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు గురించి సావనీర్‌కు సంపాదకత్వం వహించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ, సంఘసేవకురాలు, స్వాతంత్ర్యసమరయోధురాలు దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ల గురించిన పుస్తకాలు ప్రచురించారు.

సంగీత రంగం

జానకీబాల ఆకాశవాణిలో లలిత సంగీత కళాకారిణిగా తమ గానం వినిపించారు. జానకీబాల చదివిన సీతామహాలక్ష్మి జిల్లాపరిషత్తు బాలికోన్నత పాఠశాలలో తల్లి లక్ష్మీనరసమాంబ సంగీతం టీచరుగా పనిచేసేవారు. జానకీబాల ఆమె వద్ద సంగీతం అభ్యసించడం ప్రారంభించారు. క్రమంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పలు కార్యక్రమాల్లో లలిత సంగీతాన్ని ఆలపించారు. లలితగీతమాలిక , శివాక్షరమాల పాడి కేసెట్లుగా విడుదల చేశారు. ఈటీవీ2లో పాటలపాలవెల్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు సినిమా పాటలపై పదలహరి సంగీతకార్యక్రమాన్ని రేడియో స్పందనలో నిర్వహించారు.[3]

పురస్కారాలు

సంగీత, సాహిత్యరంగాల్లో కృషిచేసిన జానకీబాలను పలు పురస్కారాలు వరించాయి. అవి:[4]

మూలాలు

  1. Who's who of Indian Writers, 1999: A-M
  2. తణుకు తళుకులు(పుస్తకం):ఇంద్రగంటి జానకీబాల(అధ్యాయం):కానూరి బదరీనాథ్:పేజీ.102
  3. తణుకు తళుకులు(పుస్తకం):ఇంద్రగంటి జానకీబాల(అధ్యాయం):కానూరి బదరీనాథ్:పేజీ102,103
  4. తణుకు తళుకులు(పుస్తకం):ఇంద్రగంటి జానకీబాల(అధ్యాయం):కానూరి బదరీనాథ్:పేజీ.103
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.