ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - ఆధునిక యుగము
గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు | |||||
|---|---|---|---|---|---|
| ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ | |||||
| చరిత్ర పూర్వ యుగము | క్రీ.పూ.1500వరకు | ||||
| పూర్వ యుగము | క్రీ.పూ.1500-క్రీ.శ.650 | ||||
| • మౌర్యులకు ముందు | క్రీ.పూ.1500-క్రీ.శ.322 | ||||
| • మౌర్యులు | క్రీ.పూ.322 - క్రీ.పూ. 184 | ||||
| • శాతవాహనులు | క్రీ.పూ.200 - క్రీ.త.200 | ||||
| • కళింగులు | క్రీ.పూ.180? - క్రీ.త.400? | ||||
| • ఇక్ష్వాకులు | 210 - 300 | ||||
| • బృహత్పలాయనులు | 300 - 350 | ||||
| • అనందగోత్రులు | 295 - 620 | ||||
| • శాలంకాయనులు | 320 - 420 | ||||
| • విష్ణుకుండినులు | 375 - 555 | ||||
| • పల్లవులు | 400 - 550 | ||||
| పూర్వమధ్య యుగము | 650 - 1320 | ||||
| • మహాపల్లవులు | |||||
| • రేనాటి చోడులు | |||||
| • చాళుక్యులు | |||||
| • రాష్ట్రకూటులు | |||||
| • తూర్పు చాళుక్యులు | 624 - 1076 | ||||
| • పూర్వగాంగులు | 498 - 894 | ||||
| • చాళుక్య చోళులు | 980 - 1076 | ||||
| • కాకతీయులు | 750 - 1323 | ||||
| • అర్వాచీన గాంగులు | |||||
| ఉత్తరమధ్య యుగము | 1320 - 1565 | ||||
| • ముసునూరి కమ్మ రాజులు | 1220 - 1368 | ||||
| • ఓఢ్ర గజపతులు | 1513 | ||||
| • రేచెర్ల పద్మనాయకులు | 1368 - 1461 | ||||
| • కొండవీటి రెడ్డి రాజులు | 1324 - 1424 | ||||
| • రాజమహేంద్రవరం రెడ్డి రాజులు | 1395 - 1447 | ||||
| • బహమనీ రాజ్యము | |||||
| • విజయనగర సామ్రాజ్యము | 1336 - 1565 | ||||
| ఆధునిక యుగము | 1540 – 1956 | ||||
| • అరవీటి వంశము | 1572 - 1680 | ||||
| • పెమ్మసాని కమ్మ రాజులు | 1352 - 1652 | ||||
| • కుతుబ్ షాహీ యుగము | 1518 - 1687 | ||||
| • వాసిరెడ్డి కమ్మ రాజులు | 1314 - 1816 | ||||
| • నిజాము రాజ్యము | 1742-1948 | ||||
| • బ్రిటిషు రాజ్యము | |||||
| • స్వాతంత్ర్యోద్యమము | 1800 - 1947 | ||||
| • ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు | 1912-1953 | ||||
| • హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు | 1948-1952 | ||||
| • ఆంధ్ర ప్రదేశ్ అవతరణ | 1953-1956 | ||||
| • ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర | 1956-2014 | ||||
| • ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర | 2014- | ||||
| తెలుగు సాహిత్యం నన్నయకు ముందు నన్నయ యుగము • శివకవి యుగము తిక్కన యుగము • ఎఱ్ఱన యుగము శ్రీనాథ యుగము • రాయల యుగము దాక్షిణాత్య యుగము • క్షీణ యుగము ఆధునిక యుగము • 21వ శతాబ్ది | |||||
| చారిత్రక నగరాలు పిఠాపురం • భట్టిప్రోలు • వేంగి • ధాన్యకటకము కొలనుపాక • ఓరుగల్లు • విజయపురి • రాజమహేంద్రవరం కళింగపట్నం • హంపి • సింహపురి • హైదరాబాదు | |||||
| చారిత్రక వ్యక్తులు గణపతిదేవుడు • రుద్రమదేవి • కృష్ణదేవరాయలు శాలివాహనుడు • | |||||
యుగ చరిత్ర ముఖ్యాంశాలు
మధ్య యుగంలో కాకతీయులు, విజయనగర రాజులు, చోళులు, చాళుక్యులు, రెడ్డి రాజులు మొదలైన అనేక వంశాల పాలనలో ఉంటూ వచ్చిన ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్, 19 వ శతాబ్దం ఆరంభం నాటికి కొంత భాగం బ్రిటిషు వారి పాలనలోను, కొంత నిజాము నవాబు ఏలుబడిలోను ఉంది. ఉత్తర సర్కారులు గాను, రాయలసీమ గాను, హైదరాబాదు (నైజాం) గాను విడిపోయి ఉన్న ఈ ప్రాంతాలను కలిపే మూలసూత్రం - వీరి మాతృభాష అయిన తెలుగు. ఒకే రాష్ట్రంగా ఏర్పడాలన్న ఆకాంక్ష అన్ని ప్రాంతాల ప్రజలలోను బలంగా ఉండేది. బ్రిటిషు వారి పాలనలో ఉన్న సర్కారు (కోస్తా) జిల్లాలు, రాయలసీమ జిల్లాలు ప్రత్యేక రాష్ట్రం కోసం ముందు ఉద్యమించాయి. ఈ ప్రాంతాలు, తమిళ ప్రాంతాలతో పాటు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. ఆర్థిక, రాజకీయ రంగాల్లో తమిళుల అహేతుక ఆధిపత్యం భరించలేకా, తమకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలన్న బలీయమైన కోరిక వలనా వీరు ప్రత్యేక రాష్ట్ర దిశగా ముందు ఉద్యమించారు. హైదరాబాదు సంస్థానం కథ వేరుగా ఉండేది. నిజాము ఏలుబడిలో ఉన్న ప్రజలు, స్వాతంత్ర్యం తరువాత ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న నిజాము ఆలోచనకు వ్యతిరేకంగాను, నిజాము యొక్క రజాకార్ల దౌష్ట్యాన్ని ఎదిరించేందుకు గాను నడుం కట్టారు. నిజాము పాలన నుండి బయటపడి భారత దేశంలో విలీనం కావాలన్నదే అప్పటి వీరి ప్రధాన లక్ష్యం.
ఆధునిక యుగంలో ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో కింది ప్రధాన విభాగాలున్నాయి
అరవీటి వంశము
గోలకొండ రాజ్యము
నిజాము రాజ్యము
బ్రిటిషు రాజ్యము
ఆంధ్ర ప్రదేశ్లో బ్రిటిషు వారి పరిపాలనా కాలాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు - ఐరోపా దేశాల ఆధిపత్య పోరు కాలం, బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ పరిపాలనా కాలం, బ్రిటిషు పరిపాలనాకాలం.
ఐరోపా దేశాల ఆధిపత్య పోరు కాలం
1611 లో మచిలీపట్నంలో బ్రిటిషు వారు తమ మొదటి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చెయడంతో ఐరోపా వర్తక సంస్థల కార్యకలాపాలు ఆంధ్ర ప్రదేశ్లో మొదలయ్యాయి. బ్రిటిషు వారి ఈ స్థావరం దక్షిణ భారతదేశంలో మొదటిది, భారత్లో రెండోది. ఆ తరువాత ఫ్రెంచి, పోర్చుగీసు, డచ్చి దేశాల వారు కూడా ఆంధ్ర ప్రదేశ్లో తీరప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. వారి మధ్య ఆధిపత్య పోరు జరుగుతూ ఉండేది. అందులో భాగంగ యుద్ధాలు కూడా జరిగాయి. స్థానిక సంస్థానాధీశులతో, జమీందార్లతో చేతులు కలిపి వీరు యుద్ధాలు చేసేవారు.
స్వాతంత్ర్యోద్యమము
ఆంధ్రోద్యమములు
సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భాగమైన మూడు ప్రధాన ప్రాంతాలు పరిపాలనాపరంగా రెండు రాజ్యాల్లో ఉండేవి. కోస్తా, రాయలసీమలు అద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండగా, తెలంగాణా హైదరాబాదు సంస్థానంలో భాగంగా ఉండేది. ఈ మూడు ప్రాంతాలు, ఆయా రాష్ట్రాల/రాజ్యాల నుండి వేరుపడి ముందు, ఆంధ్ర రాష్ట్రం, హైఉదరాబాదు రాష్ట్రం అనే రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. కాలక్రమంలో ఈ రెండు రాష్ట్రాలు కలిసి సమాఇక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
బ్రిటిషు పరిపాలనా కాలంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా, బ్రిటిషు వారి అధికారంలో ఉండేవి. మద్రాసు ప్రెసిడెన్సీలో ఈ జిల్లాలు ఉండేవి: శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు. మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభాలోను, విస్తీర్ణంలోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్పటికీ, పరిపాలనలోను, ఆర్థిక వ్యవస్థలోను తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్థికంగాను గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు. 1912లో ఆధికారికంగా ప్రత్యేక రాష్ట్ర పోరాటం మొదలయింది. ఉద్యమానికి టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి వంటి నాయకులు సారథ్యం వహించారు. 40 సంవత్సరాల పోరాటం, రెండు సుదీర్ఘ నిరాహార దీక్షలు, అమరజీవి ఆత్మార్పణం, విధ్వంసానికి దారితీసిన ప్రజల కోపం తరువాత 1952 అక్టోబర్ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది.
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
1947 ఆగష్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాదు నిజాము పాలన నుండి విముక్తి కాలేదు. ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న నిజాము, తన ఆలోచనకు తగినట్లుగా ప్రయత్నాలు చేసాడు. ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతా మండలికి సమస్యను నివేదించడం, సైన్యం, ఆయుధాల సమీకరణ వంటి ప్రయత్నాలు వీటిలో కొన్ని. దీనికి తోడు రజాకార్ల హింస పెచ్చుమీరడంతో, హైదరాబాదు ప్రజలు కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ పోరాటం జరిపారు. పరిస్థితి విషమిస్తున్న దశలో భారత ప్రభుత్వం 1948 సెప్టెంబరు 13 న పోలీసు చర్యకు దిగింది. భారత సైన్యం హైదరాబాదును ముట్టడించి, నిజామును ఓడించింది. 5 రోజుల్లో ముగిసిన పోలీసు చర్యతో సెప్టెంబరు 18 న హైదరాబాదు సంస్థానం భారత దేశంలో విలీనమయింది. మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి, 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నాడు. 1950 జనవరిలో ఎం.కె.వెల్లోడి ముఖ్యమంత్రి అయ్యాడు. నిజామును రాజ్ ప్రముఖ్గా ప్రకటించారు. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చింది. భారత ప్రభుత్వం సైనిక చర్య (పోలీసు చర్య) తీసుకోవలసి వచ్చింది. 1948 సెప్టెంబరు 17 న జరిగిన ఆపరేషన్ పోలో తరువాత, నిజాము భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. హైదరాబాదు సంస్థానం హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది.
ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు
1953 డిసెంబరులో సయ్యద్ ఫజల్ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషను ఏర్పాటయింది. విశాలాంధ్ర ఏర్పాటు లోని ప్రయోజనాలను అది గుర్తించినా, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అది సమర్థించింది. దీని నివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, హైదరాబాదు శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. హైదరాబాదు శాసనసభలో అధిక శాతం సభ్యులు విశాలాంధ్రను సమర్ధించారు. కాంగ్రెసు అధిష్ఠానం కూడా విశాలాంధ్రనే సమర్థించి, ఆంధ్ర, తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. ఆ విధంగా వారిమధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరి, 1956 నవంబరు 1 న ఆధికారికంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.
ఆంధ్ర ప్రదేశ్ విభజన
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న తెలంగాణా ఆకాంక్షల ఫలితంగా తెలంగాణా ప్రత్యేక ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమాల ఫలితంగా 2014 జూన్ 2 వ తేదీన సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ అనే రెండు రాష్ట్రాలుగా విభజించబడింది.
ఇవి కూడా చూడండి
- ప్రధాన వేదిక: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
- ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
మూలాలు
వనరులు
- ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
- ఏటుకూరి బలరామమూర్తి - ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్