అరుణా అసఫ్ అలీ

అరుణా అసఫ్ అలీ (ఆంగ్లం Aruna Asaf Ali) (బెంగాళీ: অরুণা আসফ আলী) (జూలై 16, 1909 - జూలై 29, 1996) ప్రసిద్ధ భారత స్వాతంత్రోద్యమ నాయకురాలు. 1942లో గాంధీజీ జైలుకెళ్ళినపుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో బొంబాయిలోని గవాలియా టాంకు మైదానంలో భారత జాతీయపతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయురాలు. ఢిల్లీ నగరానికి మెట్టమొదటి మేయర్. ఈమెకు మరణానంతరం భారతరత్న అవార్డు లభించింది.

Aruna Asaf Ali
Aruna Asaf Ali.
జననంజూలై 16, 1909
Kalka, Punjab, British India (now Haryana)
మరణం1996 జూలై 29 (1996-07-29)(వయసు 87)
జాతీయతIndian
విద్యాసంస్థలుSacred Heart Convent
వృత్తిIndian independence activist, teacher

తొలి జీవితం

అరుణా గంగూలీ, హర్యానాలోని కాల్కాలో ఒక బెంగాళీ బ్రహ్మసమాజ కుటుంబంలో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం లాహోరు మరియు నైనీతాల్ లలో జరిగింది. చదువు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. దేశములోని అప్పటి పరిస్థితుల్లో అది ఒక మహిళకు గొప్ప ఘనతే. ఈమె కలకత్తాలోని గోఖలే స్మారక పాఠశాలలో బోధించినది. అరుణకు భారత జాతీయ కాంగ్రేసు నాయకుడైన అసఫ్ అలీతో అలహాబాదులో పరిచయమేర్పడింది. ఈ పరిచయం పెళ్ళికి దారితీసింది. అరుణ తల్లితండ్రులు మతాలు వేరు (ఈమె హిందూ, అతను ముస్లిం), వయోభేదము (ఇద్దరికీ వయసులో 20 ఏళ్ళకి పైగా తేడా) ఎక్కువన్న భావనతో ఆ పెళ్ళిని వ్యతిరేకించినా 1928లో అసఫ్ అలీని వివాహమాడింది.

కుటుంబము

అరుణ తండ్రి ఉపేంద్రనాథ్ గంగూలీ తూర్పు బెంగాల్లోని బరిసాల్ జిల్లాకు చెందినవాడు. అయితే సంయుక్త రాష్ట్రాల్లో (యునైటెడ్ ప్రావిన్స్)లో స్థిరపడ్డాడు. ఆయన ఒక రెస్టారెంటు యజమాని మరియు సాహసికుడు. ఈమె తల్లి అంబాలికా దేవి, అనేక హృద్యమైన బ్రహ్మసమాజ ప్రార్ధనాగీతాలు రచించిన ప్రముఖ బ్రహ్మజ నాయకుడు త్రైలోక్యనాథ్ సన్యాల్ యొక్క కూతురు. ఉపేంద్రనాథ్ గంగూలీ యొక్క చిన్నతమ్ముడు ధీరేంద్రనాథ్ గంగూలీ తొలితరం భారతీయ సినిమా దర్శకుడు. ఇంకో సోదరుడు నాగేంద్రనాథ్, ఒక మృత్తికా జీవశాస్త్రజ్ఞుడు, రవీంద్రనాథ్ టాగూర్ యొక్క జీవించి ఉన్న ఏకైక కుమార్తె మీరాదేవిని పెళ్ళిచేసుకున్నాడు. కానీ, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు విడిపోయారు. అరుణ సోదరి, పూర్ణిమా బెనర్జీ భారత రాజ్యాంగ సభలో సభ్యురాలు.

స్వాతంత్ర్యోద్యమం: తొలి రోజులు

వివాహము తర్వాత అరుణ భారత జాతీయ కాంగ్రేసులో క్రియాశీలక సభ్యురాలై ఉప్పు సత్యాగ్రహములో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనలలో పాల్గొన్నది. ఈమెను దేశదిమ్మరి అనే అభియోగము మోపి అరెస్టు చేశారు. అందువల్ల రాజకీయ ఖైదీలందరి విడుదలకు తోడ్పడిన గాంధీ-ఇర్వింగ్ ఒప్పందముతో 1931లో ఈమెను విడుదల చేయలేదు. అరుణతో పాటు ఖైదులో ఉన్న ఇతర మహిళా ఖైదీలు అరుణను విడుదల చేసేవరకు జైలును వదిలి వెళ్ళేది లేదని పట్టుబట్టారు. మహాత్మా గాంధీ కలుగజేసుకోవటంతో కానీ వీరు తమ పట్టును సడలించలేదు. ఆ తరువాత ప్రజాఆందోళన వలన ఈమెను విడుదల చేశారు.

1932లో తీహార్ జైళ్ళో రాజకీయ ఖైదీగా ఉండగా అరుణ జైల్లో రాజకీయ ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా నిరాహారదీక్ష నిర్వహించింది. ఈమె ప్రయత్నం ఫలితంగా తీహర్ జైళ్లో రాజకీయ ఖైదీల పరిస్థితి మెరుగైంది కానీ ఈమెను అంబాలా జైలుకు తరలించి ఒంటరి ఖైదులో ఉంచారు. జైలునుండి విడుదలైన తర్వాత ఈమె రాజకీయాలలో పాల్గొనలేదు.

ఇవి కూడా చూడండి

మూలాలు

    ఇతర లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.