వింత కాపురం

పద్మశ్రీ పిక్చర్స్ పతాకంపై పి.పుల్లయ్య బావమరిది వెంకటేశ్వర్లు నిర్మాతగా, మరో బంధువు వి.వి.సుబ్బారావు (అబ్బి) దర్శకత్వంలో నిర్మించిన వింత కాపురం 1968 నవంబర్ 3న విడుదలైంది.

వింత కాపురం
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం అబ్బి
నిర్మాణం వి. వెంకటేశ్వర్లు
తారాగణం కృష్ణ,
కాంచన,
సూర్యకాంతం,
పద్మనాభం,
శాంతకుమారి
సంగీతం మాస్టర్ వేణు
నిర్మాణ సంస్థ పద్మశ్రీ పిక్చర్స్
భాష తెలుగు

కథ

బర్మా ఇండస్ట్రీ అధినేత శ్రీనివాసరావు (నాగభూషణం). అతని గారాల కూతురు విజయ (కాంచన). ఆఫీసులో హెడ్ గుమాస్తా గరుడ వాహనం (అల్లు రామలింగయ్య), అతని భార్య ధనం (రాధాకుమారి), అతని కుమర్తె రమణమ్మ (రమాప్రభ). సీతానగరంలో రాయకోటి రాఘవయ్య (రావి కొండలరావు) రిటైర్డ్ ఉపాధ్యాయుడు. అతని కుమారుడు రాజశేఖర్ (కృష్ణ). అతనికి బర్మా కంపెనీ నుంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూ వస్తుంది. దానికోసం తన డొక్కు కారుతో పట్నం వెళ్ళిన రాజు, దారిలో కలిసిన విజయ, స్నేహితులతో చిన్న గొడవ పడతాడు. రాజుకు శ్రీనివాసరావు కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అయితే రాజుకు ఆ ఉద్యోగం ఇవ్వటానికి విజయ వ్యతిరేకిస్తుంది. కాని రాజు, తన మిత్రుడు ఆంజనేయుడు (పద్మనాభం), గరుడవాహనం సాయంతో ఓ నాటకం ఆడి ఉద్యోగం నిలబెట్టుకుంటాడు. రాజుతో విభేదిస్తూనే అతన్ని ప్రేమిస్తుంది విజయ. రంగరాజు (ప్రభాకర్‌రెడ్డి) అనే వంచకుడు, దుర్మార్గుడు, పల్లెటూరిలో రాంబాణమ్మ (సూర్యకాంతం) కూతురు కమల (సంధ్యారాణి)ను ప్రేమించానని నమ్మబలికి మోసంతో లేవదీసుకువస్తాడు. ఓ గ్యాంగ్ సాయంతో అక్రమాలు చేస్తుంటాడు. అందగత్తె, ధనవంతురాలైన విజయను పొందాలనే ఆశతో, కమల అడ్డు తొలగించుకోవాలని తన అనుచరుడు పులి (నెల్లూరు కాంతారావు)కి పురమాయిస్తాడు. అతడు, ఆమెను రంగరాజు తల్లివద్దకు చేరుస్తాడు. విజయ, రాజులు ఒకరినొకరు ప్రేమించుకోవటంతో శ్రీనివాసరావు వారిద్దరికీ వివాహం జరిపిస్తాడు. ఆ పెళ్లికానుకగా రంగరాజు, కమల తనకు పంపిన ఫొటోను రాజుకు పంపుతాడు. ఆ ఫొటోను చూసిన విజయ అపార్ధం చేసుకోవటంతో, రాజు ఇల్లువదిలి వెళ్లిపోతాడు. ఆంజనేయులు సాయంతో రంగరాజు కుట్రను ఛేదించటంతో పోలీసులు రంగరాజును అరెస్ట్ చేస్తారు. అతని తల్లి శాంతకుమారి వచ్చి కొడుకును మందలించడంతో, అపార్థాలు తొలగి భార్యాభర్తలు తిరిగి ఏకమవుతారు. ఆ సన్నివేశంతో చిత్రం ముగుస్తుంది[1].

నటీనటులు

సాంకేతికవర్గం

  • కథ, మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
  • సంగీతం: మాస్టర్ వేణు
  • స్టంట్స్: రాఘవులు అండ్ పార్టీ
  • కళ: ఎస్ కృష్ణారావు
  • ఛాయాగ్రహణం: పిఎస్ సెల్వరాజ్
  • నృత్యం: తంగప్ప
  • సహాయకులు: రాజు, తార
  • టైటిల్స్ డిజైన్: కెఎస్ మణి
  • స్క్రీన్‌ప్లే: పి.పుల్లయ్య
  • నిర్మాత: వి వెంకటేశ్వర్లు
  • దర్శకత్వం: వివి సుబ్బారావు (అబ్బి)

పాటలు

  1. అటు పానుపు ఇటు నువ్వు అటు జాబిలి ఇటు నువ్వు - పి.సుశీల, ఘంటసాల - రచన: డా॥ సినారె
  2. చూపుల్లోనె కోపం లోపల ఎంతో తాపం .. అహ తెలిసిందిలే - ఘంటసాల బృందం - రచన: దాశరథి
  3. ఎంత వాళ్ళు, ఎంత వాళ్ళు ఈ మగవాళ్లు ఎంతకయినా చాలినోళ్లు - ఎల్.ఆర్.ఈశ్వరి, పి.సుశీల
  4. ఎందుకు ఈ బిగువులు ఏమిటి ఈ పరుగులు - పిఠాపురం, స్వర్ణలత
  5. రావోయి పొందవోయి ఈ రేయి - ఎల్‌.ఆర్.ఈశ్వరి
  6. చూడు తఢాఖా కాదు మజాకా నాదారికి లేదు ధోకా - ఘంటసాల, సుశీల బృందం - రచన: ఆరుద్ర

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.