వరకట్నం (సినిమా)

ఇది 1968లో విడుదలైన తెలుగు చిత్రం. ఎన్.టి.ఆర్ సొంత బానర్ పై తీయబడింది. దురాచారమైన వరకట్నం ప్రధాన విషయంగా సాగుతుంది. పల్లెటూరి మొండిపట్టుదలలు, అక్కడి మనుషుల మధ్య అనుబంధాలు, పట్టింపులు చిత్రితమయ్యాయి. ఎన్.టి.ఆర్ ఆహార్యం, పంచకట్టు అప్పటికి అధునాతనం. విలన్ గా నటించిన రాజనాల పై చక్కటి పాట 'సైసై జోడెడ్ల బండి' చిత్రీకరించడం విశేషం. చిత్రంలో కళ ద్వారా కృష్ణాజిల్లా పరిసరప్రాంతాల సంప్రదాయాలు, ఇంటి అలంకరణ తదితర విషయాలు చూపబడ్డాయి.

వరకట్నం
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం నందమూరి తారక రామారావు
నిర్మాణం ఎన్. త్రివిక్రమరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణకుమారి,
సావిత్రి,
నాగభూషణం,
రాజనాల,
హేమలత
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ రామకృష్ణ & ఎన్.ఎ.టి కంబైన్స్
భాష తెలుగు

కథ

ఇది రెండు గ్రామాలకు చెందిన కథ. మీసాల సుబ్బయ్య ఓ గ్రామానికి మోతుబరి రైతు (నాగభూషణం). కొడుకు దేవసింహ (ఎన్‌టి రామారావు), భార్య కాంతమ్మ (హేమలత). పక్క గ్రామానికి చెందిన మరో మోతుబరి భద్రయ్య (మిక్కిలినేని). అతని కొడుకు బలరామయ్య (సత్యనారాయణ), కోడలు సుభద్ర (సావిత్రి), కుమార్తె సుజాత (కృష్ణకుమారి). సుబ్బయ్య కుమారునికి భద్రయ్య కుమార్తెకు వివాహం నిశ్చయమవుతుంది. పెళ్లిలో సుబ్బయ్య గ్రామానికి చెందిన పేచీకోరు అచ్చయ్య (అల్లు రామలింగయ్య) తెచ్చిన మాట పట్టింపుతో దేవసింహ సుజాతకు తాళి కట్టకుండా వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. అదే గ్రామంలో శ్రీరాములు (పెరుమాళ్లు) సాధారణ రైతు. అతని కూతురు లక్ష్మి (చంద్రకళ). చుక్కమ్మ- రంగయ్య (రేలంగి)ల కుమారుడు దేవయ్య (పద్మనాభం). దేవయ్య -లక్ష్మి పెళ్లిలోనూ కట్నం కారణంగా గొడవలు తలెత్తుతాయి. అయినా లక్ష్మికి దేవయ్య తాళికట్టడంలో, అత్తింటివారు ఆమెను తమతో తీసుకెళ్తారు. కట్నం పేచీ నేపథ్యంలో కొడుకు దేవయ్యను లక్ష్మి కలవకుండా చుక్కమ్మ వేధింపులకు గురి చేస్తుంటుంది. కట్నం కోసం ఆమెపైన, ఆమె తండ్రిపైన నిందలు వేయటంతో లక్ష్మి, శ్రీరాములు ఇబ్బందులు పడుతుంటారు. లక్ష్మి అన్న సుబ్బన్న (ప్రభాకర్‌రెడ్డి) వేలుకు దెబ్బ తగలడం వలన చెల్లెలి కోసం ఆరాట పడుతుంటాడు. ఈ క్రమంలో తండ్రి ఆంక్షలు పెట్టినా దేవసింహ మాత్రం సుజాతే తన భార్య అని నిశ్చయించుకుంటాడు. తల్లి దీవెన తీసుకుని, సుజాతను ఆమె వదిన సుభద్ర సాయంతో కలుసుకుంటాడు. ఆమెకు తాళికట్టి భార్యగా స్వీకరిస్తాడు. బలరామయ్య తన మిత్రుడు మల్లయ్యదొర (రాజనాల)తో తిరిగి, సుజాతకు పెళ్లిచేయ నిశ్చయించటం, దేవసింహ మల్లయ్యదొర గొడవ పడటం, బలరామయ్య వలన దేవసింహ గాయపడటం, మనసు చెదిరిన సుజాత ఆత్మహత్య ప్రయత్నం చేసి మామగారింటికి చేరటం, వారంతా తిరిగి సుజాత ఇంటికి వచ్చి భద్రయ్య, బలరామయ్యతో కలిసి దేవసింహ, సుజాతలను ఆశీర్వదించటం, దేవయ్య తన తల్లితో నాటకమాడి బుద్ధివచ్చేట్టుచేసి, లక్ష్మిని, తండ్రిని కలపటం, ఈ రెండు జంటలు ఒకచోట ఆనందంగా నిలవటంతో చిత్రం సుఖాంతమవుతుంది[1].

నటీనటులు

  • నాగభూషణం -
  • హేమలత -
  • ఎన్.టి.రామారావు -
  • మిక్కిలినేని
  • సత్యనారాయణ
  • సావిత్రి
  • కృష్ణకుమారి
  • పెరుమాళ్లు
  • చంద్రకళ
  • రేలంగి
  • పద్మనాభం
  • ప్రభాకరరెడ్డి
  • రాజనాల
  • రావికొండలరావు

సాంకేతికవర్గం

  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్‌టి రామారావు
  • సంగీతం: టివి రాజు
  • నృత్యం: వెంపటి సత్యం
  • కూర్పు: జిడి జోషి
  • స్టంట్స్: సాంబశివరావు
  • కళ: ఎస్ కృష్ణారావు
  • కెమెరా: రవికాంత్ నగాయిచ్
  • మాటలు: మద్దిపట్ల సూరి, సముద్రాల జూనియర్
  • నిర్మాత: టి త్రివిక్రమరావు

పాటలు

  1. అడుగు అడుగులో మదమరాళములు తడబడి - ఘంటసాల,సుశీల - రచన: డా॥ సినారె
  2. ఇదేనా మన సంప్రదాయమిదేనా - ఘంటసాల - రచన: డా॥ సినారె
  3. ఎన్నాళ్ళకు నా నోము పండింది ఇన్నాళ్ళకు - ఘంటసాల,సుశీల - రచన: డా॥ సినారె
  4. ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక ఎప్పుడైన తప్పదన్నా - మాధవపెద్ది
  5. గిలకల మంచం ఉంది చిలకల పందిరి పొందు - కె. జమునారాణి, పిఠాపురం
  6. మరదల మరదల తమ్ముని పెళ్ళామా ఏమమ్మా - సుశీల,జిక్కి
  7. మల్లెపూల పందిట్లోన చందమామ వెన్నెట్లోన చల్లగాలికి - బి.గోపాలం,కె. జమునారాణి
  8. సైసై జోడెడ్లబండి బండి హో షోకైన దొరలబండి - ఘంటసాల, మాధవపెద్ది - రచన: కొసరాజు

పురస్కారాలు

బయటి లింకులు

మూలాలు

  1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (12 January 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50 వరకట్నం". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 25 January 2019.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.